25 ఏప్రిల్, 2012

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు.


రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది.


కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు అంతేకాక నా స్నేహితులందర్నీ తినేసానని మీకు చెప్పమని ఆజ్ణాపించాడు" అని అంది. సింహం వెంటనే, అది పడుకున్న చోట నుండి లేచింది. "అదెక్కడుంటుందో నాకు ముందుచెప్పు? నేను దానిని బతికుండగానే తినేస్తాను" అంది కోపంగా.


"అది ఆముదం చెట్టు వెనుక ఉన్న ఒక బావిలో గుహ ఏర్పరచుకుని అందులో ఉంటోంది రాజా!" అని కుందేలు బదులు పలికింది.కుందేలును వెంటబెట్టుకుని సింహం బావి దగ్గరికి వచ్చింది. సింహం బావి గోడలపైన నిలబడి బావిలోపలికి తొంగి చుసింది. బావిలో దానికి మరో సింహం కనిపించింది. కానీ, వాస్తవానికి అక్కడ కనిపించింది నీటిలో తన ప్రతిబింబమే. కానీ, సింహం దాన్ని మరో సింహం అనుకుంది. అది తన భయంకరమైన పళ్ళు చూపింది. ఇంకో సింహం కూడా తన పళ్ళు చూపించింది. సింహం గట్టిగా గాడ్రించింది. రెండోది కూడా అదే చేసింది. బావిలో నుండి సింహం గొంతు ప్రతిధ్వనించి తిరిగి దానికే మరింత భయంకరంగా వినిపించింది.


ఇంకో సింహం ఆ ఆడవిలోకి వచ్చిందనుకుంది సింహం. మరేమీ ఆలోచించకుండా బావిలో ఉన్న ఆ కొత్త సింహం మీదకి ఉరికింది. దానితో అది బావిలో పడి, నీటిలో మునిగి చనిపోయింది. కుందేలు సంతోషంతో వేగంగా గెంతుతూ తిరిగి వెళ్ళిపోయింది. అది ప్రాణాలతో రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. జరిగినదంతా విడమర్చి చెప్పింది కుందేలు, సింహం పీడ పోయినందుకు అన్నీ సంతోషించాయి.

23 ఏప్రిల్, 2012

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు.

ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది.
తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా...!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడ్నించీ వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగీ గుడిసె దగ్గరకు వచ్చి "తలుపు తియ్యమని బ్రతిమాలుకుంది" అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మకి తెల్ల కాళ్లుంటాయి" అని అన్నాయి.

ఆహా! అలాగా అనుకుంటూ అక్కడ్నించీ వెళ్లిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్లరంగు పులుముకుని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపుతీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి, అక్కడ్నించి పారిపోయింది. 

22 ఏప్రిల్, 2012

బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్

ఒకనాడు అక్బర్ చక్రవర్తి నిండు సభను కొలువు దీర్చి ఉన్నాడు. ఆ సందర్భంగా ఆయనకు ఒక సందేహం వచ్చింది. సభను ఒకసారి పరికించి చూసాడు. అక్బర్ పాదుషా చూపు వెనుక అర్థం తెలియక సభలోని వారందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్బర్ కంఠస్వరం సభలో ఖంగుమని వినిపించింది. "సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను రెండు మూడు పదాల్లో ఎవరైనా చెప్పగలరా?"
సభలోని వారెవ్వరూ పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేదు. ఏమి సమాధానం చెప్తే పీకల మీదకు ఏమి ముంచుకొస్తుందో అని నిమ్మకు నీరేత్తినట్లు సభికులు కూర్చుండిపోయారు. కొంత సేపు గడిచిన పిదప అక్బర్, బీర్బల్ వైపు చూశాడు. అదేసమయానికి పాదుషా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తన ఆలోచనల్లో వెదుక్కునే పనిలో నిమగ్నమై బీర్బల్ కనిపించాడు.
అక్బర్ : బీర్బల్ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు
బీర్బల్ : చిత్తం ప్రభూ! సత్యం-అసత్యాల మధ్య చేతికున్న నాలుగు వేళ్లే అంతరం జహపనా!
అక్బర్‌తో పాటు సభలోనివారందరికీ బీర్బల్ సమాధానం వెనుక అంతరార్ధం బోధపడలేదు.
అక్బర్ : బీర్బల్ నీ సమాధానాన్ని మరింతగా వివరిస్తావా?
బీర్బల్ : తప్పకుండా ప్రభూ! మహారాజా కంటికి, చెవికి మధ్య దూరం నాలుగు వేళ్లేనన్నది అందరికి తెలిసిందే. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. బీర్బల్ వివరణకు అక్బర్‌తో పాటు సభికులు సైతం హర్షధ్వానాలు ప్రకటించారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్దుడైన అక్బర్, అతనిని వేయి బంగారు నాణేలతో సత్కరించాడు.

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి.


మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది.
ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి.చెరువులో నీళ్లు ఇంకిపోసాగాయి. అది తెలిసిన జాలర్లు వల తీసుకుని చెరువుకు వచ్చారు. జాలర్లను చూసిన రెండో చేప కాస్తంత తెలివిగా ఆలోచించి చచ్చిన దానిలాగా పడుకుంది. ఛీ..ఛీ చచ్చిపోయిన చేప మనకెందుకులే అనుకుంటూ జాలర్లు ఎత్తి దూరంగా విసిరి పారేశారు. జాలర్లు విసిరిన విసుర్లో... అది పక్కనే ఉన్న చిన్న నీటి కొలనులో పడి ప్రాణాలు దక్కించుకుంది.


ఇక చెప్పిన మాట వినని మూడో చేప మాత్రం వలలో పడి గిజ గిజ తన్నుకుంటూ జాలర్ల కంట్లో పడింది. ఆహా ఎంత పెద్ద చేపో... భలేగా వలలో పడిందని వాళ్లు సంతోషిస్తూ... ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినేశారు.



గొప్ప మంత్రి బీర్బల్‌

ఒకసారి అక్బర్‌ చక్రవర్తి కొలువుకు ఒక సాధువు విచ్చేశాడు. 'ప్రభూ, మీ కొలువులో 'నవరత్నాలు' అని పిలువబడే తొమ్మిదిమంది మహాపండితులున్నారని విన్నాను. మీరు అనుమతిస్తే వారిని పరీక్షించాలను కుంటున్నా. ఆ తొమ్మిదిమందిలో ఒక్కరైనా నా ప్రశ్నకు సమాధానం యిస్తే మీ సామ్రాజ్యాన్ని దీవించి వెళ్తా. ఇవ్వలేకుంటే మాత్రం జరగబోయే అరిష్టానికి సిద్ధపడి వుండండి' అన్నాడు. 'ఆయన సవాల్‌ను స్వీకరించాలా? వద్దా?' అని చక్రవర్తితో సహా అందరూ మీమాంసలో పడిపోయారు.

కొద్దిసేపటి తర్వాత బీర్బల్‌ లేచి నిల్చుని, 'అయ్యా, అతని సవాల్‌ను స్వీకరించండి. ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా' అన్నాడు. చక్రవర్తి అనుమతితో సాధువు మొదలుపెట్టాడు, 'ఒకసారి ముగ్గురు ప్రయాణీకులు చీకటిపడే వేళకు ఒక సత్రం వద్దకు చేరుకున్నారు. 'మా ముగ్గురికి మూడు గదులు ఇవ్వండి' అని అడిగారు. అందుకు సత్రం అధికారి 'ప్రస్తుతం మూడు గదులు ఖాళీగా లేవు. కానీ ఒక పెద్ద గది, అందులో మూడు మంచాలు ఉన్నాయి. అందులో మీరు ముగ్గురూ వుండొచ్చు' అన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. 'ఆ గదికి ముప్పయి కంచునాణేలు కిరాయి' అని అధికారి చెప్తే, వెంటనే చెల్లించారు. ఆ తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమాస్తా, అధికారి వద్దకు వచ్చి, 'అయ్యా ఆ గదికి అసలు అద్దె 25 నాణాలే. మీరు 5 నాణేలు ఎక్కువ వసూలు చేశారు' అని చెప్పాడు. ఆ అధికారి చాలా నిజాయితీపరుడు. ఆయన వెంటనే ఒక నౌకరును పిలిచి, 'అధికంగా తీసుకున్న 5 నాణేలు అతనికి ఇచ్చి వాటిని ఆ ముగ్గురికి తిరిగి ఇచ్చెయ్యమని ఆదేశించాడు.

కాని ఆ నౌకరు అంత నిజాయితీపరుడేం కాదు. '5 నాణేలను ముగ్గురికి పంచటం అసంభవం', అనుకుని అతడు రెండు నాణేలు తన జేబులో వేసుకుని, మిగతా మూడు నాణేలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున తిరిగి ఇచ్చేశాడు. అసలు సమస్య ఏమిటంటే మొత్తం నాణేలు 30. అందులో నౌకరు 2 నాణేలు తీసుకున్నాడు. గది కిరాయి 27 నాణేలు. అంటే మొత్తం 29 నాణేలు. మరి ఆ 30 వ నాణెం ఎటుపోయింది? ' అని అడిగాడు సాధువు.

సమస్య సాధారణంగానే అనిపించినా, జవాబు జఠిలంగా ఉంది. సదస్సులో ఉన్న వాళ్ళంతా లెక్కలు మళ్ళీ మళ్ళీ చేశారు. కానీ జవాబు తెలుసుకోలేకపోయారు. ఆఖరికి వాళ్ళు అందరూ బీర్బల్‌ వైపు చూశారు, 'నీవే శరణ్యం' అన్నట్టుగా. అప్పుడు బీర్బల్‌, 'అయ్యా, సాధువు గారూ, మీరు చాలా సులభమైన ప్రశ్న అడిగారు. మీరు మీ మాటల ద్వారా ఆ సమస్య చాలా జఠిలమైందని అందరూ తికమకపడేలా చేశారు.

అసలు సమస్య ప్రకారం ముగ్గురు ప్రయాణీకులు 30 నాణేలు చెల్లించారు. 3 నాణెలు వాపస్‌ తీసుకున్నారు. అంటే నిజానికి వాళ్లు 27 నాణేలే చెల్లించారు అనుకుందాం. గుమాస్తా కూడా 27 నాణేలు అంగీకరించాడు. కానీ జవాబు చాలా సులభమైంది. ఆ ప్రయాణీకులు చెల్లించిన 27 నాణేలలో, 2 నాణేలు నౌకరు తీసుకున్నాడు. మిగిలిన 25 నాణేలు గది అద్దె. కాబట్టి ఒక నాణెం ఏమైంది అనే ప్రశ్నే ఉదయించదు. ఇది జనాలను మూర్ఖులను చేయటానికి ఉపయోగించిన చిన్న చిట్కా. అంతేనా? ఏమంటారు?' అన్నాడు.

'భలే చెప్పావు బీర్బల్‌?' అన్నాడు సాధువు మెచ్చుకోలుగా. తర్వాత అక్బర్‌ వైపు తిరిగి, 'ప్రభూ మీరు చరిత్రలో గొప్ప మొఘల్‌ చక్రవర్తిగా, బీర్బల్‌ గొప్ప మంత్రిగా శాశ్వతంగా నిలిచిపోతారు. ఇవే నా ఆశీస్సులు!' అని దీవించాడు.

21 ఏప్రిల్, 2012

బీర్బల్ తెలివి తేటలకు ఇరాన్ రాజు పరీక్ష

ఒక సారిఇరాన్ రాజుకి బీర్బల్ ను చూడాలనిపించింది ఒక సారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బెర్బల్కి సందేశం పంపించాడు మరో రెండు నెలలో ఇరాన్ కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడుబీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు టోపీ లూ పెట్టించి మరో ఐదుగుర్ని తనతో పాటు సింహాసనం పై కుర్చోబెట్టుకున్నాడు బీర్బల్ తెలివి తేటలకు ఇదిఒక పరీక్ష అనుకున్నాడు .
.
బీర్బల్ రాణే వచ్చాడు రాజభటులు బీర్బల్ను సాదరంగా రాజ సభకు తీసుకువచ్చారు బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది సభలో అడుగు పెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు ఆరుగురు రాజులు కూర్చొని వుండటం చూసి తనకు పరీక్షా పెట్టటానికే ఈ ఏర్పాటు అనుకున్నాడు ఒక్క నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్లి అభివాదం చేసాడు ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు ..... ఇంటమందిలో నీనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు ? అని బీర్బల్ని అడిగాడు ఏముంది రాజా ! మీరు తిన్నగా చూస్తువుంటే ఈ నకిలీ రాజులు మిమల్నే చూస్తున్నారు అన్నాడు బీర్బల్ .

ఇంత నిశిత పరిశీలనా వుండి కాబట్టే మీరు మహా మేధావి మిమల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ ని కౌగిలించుకున్నాడు సభ లో ప్రజలందురు బీర్బల్ తెలివికి జోహర్లు అర్పించారు

దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది.


  దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్లను వెళ్లగొట్టించాడు.అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బల్ మరుసటిరోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాన్నను, గుడ్డివాడైన సాధువును రాజు సభకు పిలిపించాడు.

నువ్వు ఈ అమ్మాయి అమ్మానాన్నలను చంపావా? అని గుడ్డి సాధువు ప్రశ్నించాడు బీర్బల్. "నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను?" అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా..?! అంటూ ఒక్క నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే.... తనకు అపాయం ముంచుకొస్తోందని గ్రహించిన సాధువు వెంటనే మరో కత్తి తీసుకుని బీర్బల్ పైకి ఎదురుదాడికి దిగాడు దొంగసాధువు.అసలు రూపాన్ని బయటపెడుతూ తనపైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేగాకుండా అతడివల్ల నష్టపోయిన ఆ అమ్మాయికి రాజు ఆస్థానంలోనే ఆశ్రయం కల్పించాడు
    



19 ఏప్రిల్, 2012

ఆశపోతు ధనయ్య

అనగా అనగా ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు. ఓసారి "ఊరికామందు" ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి.

దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది. వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు. వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు. అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు. కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు. దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు. నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు. పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.

 

18 ఏప్రిల్, 2012

గొర్రెల కాపరిని రక్షించబోయి ఇరుక్కున్న బీర్బల్



 ఒకరోజు అక్బరు చక్రవర్తి, మంత్రి బీర్బల్ పచ్చికబయళ్లలో నడుస్తున్నారు. అక్కడ ఒక గొర్రెలకాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతున్నాడు. అక్బరు ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనించాడు. ‘‘ఏమోయ్! నువ్వు గొర్రెలను సరిగ్గా మేపటం లేదు. ఇలాగయితే నీకు శిక్ష తప్పదు’’ అని గొర్రెలకాపరితో కోపంగా అన్నాడు అక్బరు.



కాపరి భయంతో వణికిపోయాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూశాడు. బీర్బల్ కల్పించుకుని ‘‘ప్రభూ! మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు. అక్బరు కోపం రెట్టింపయ్యింది. ‘‘నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు, గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకువెళ్ళి కడుపునిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం గొర్రె లావెక్కుందో లేదో’’ అన్నాడు.

గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ తను ఇరుక్కున్నాడు. ఆ ఆపదలోంచి బయటపడే మార్గం గురించ ఆలోచిస్తూ ఒక గొర్రెను తీసుకుని చక్రవర్తిని అనుసరించాడు.  అక్బరు ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్పాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకుని ఉండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసివెళ్లిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో రాత్రిపూట ఉండేలా ఒక కసాయిని నియమించాడు. అతను చేయాల్సిన పని గొర్రెకు కనబడేలా కత్తిని నూరుతూ ఉండటమే. 

కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడింది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో తిన్న తిండి ఒంటబట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తరువాత అక్బరు వచ్చి గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు బీర్బల్ ఆయనతో ఉన్నాడు. ‘‘నువ్వు చెప్పింది నిజమే బీర్బల్. కానీ... నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి?’’ అని అడిగాడు.

‘‘ఏమీ లేదు ప్రభూ, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం భయం’’ అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరించాడు. అక్బరు మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తట్టాడు.

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు.

వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు.

గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్రాలు గీయటం పూర్తి చేశారు. అందులో మొదటి చిత్రకారుడు తాను గీసిన చిత్రం తీసుకెళ్లి రాజుకి చూపించాడు. అచ్చం రాజుగారిలా వున్న చిత్రానికి రాజుగారికి మల్లే మెల్లకన్నూ యధావిధిగా చిత్రించాడు అతడు. అది చూసిన రాజు ఊహించినట్టుగానే ఉగ్రుడై చిత్రకారుడిపై కోపం ప్రదర్శించి తన అసహనం చూపించాడు. రెండవ చిత్రకారుడు చాలా ఆనందంగా తాను గీసిన చిత్రం తీసుకుని రాజు వద్దకొచ్చాడు. ఆ చిత్రం కూడా రాజులాగే చాలా అందంగా ఉంది. చిత్రంగా రాజు రెండు కళ్లూ సరిగ్గా వున్నట్టు గీసాడతడు.ఆ చిత్రకారుడి అతి వినయానికి తెలివికి చిరాకు పడ్డాడు రాజు. అసంతృప్తితో నిరుత్సాహంగా దాన్ని పక్కన పడేశాడు.

చివరగా మూడో చిత్రకారుడు చాలా ధైర్యంగా తాను గీసిన సుదర్శనుడి అందమైన చిత్రపటాన్ని రాజు చేతికందించాడు. దాన్ని తీక్షణంగా చూసిన రాజు మొహంలో చిరునవ్వులు మెరిశాయి.ఆ చిత్రకారుడి యుక్తికి నైపుణ్యానికి మనసారా అభినందించి విలువైన బహుమతులు అందించడమేగాక అతడ్ని ఆ రాజ్యానికి ఆస్థాన చిత్రకారుడిగా నియమించాడు రాజు. అందమైన రూపంతో జీవకళ ఉట్టిపడే ముఖ కవళికలు, అపురూప ఆభరణాలు రాచఠీవితో హుందాగా ఒక పక్కకు చూస్తూ కూర్చున్నట్టు గీసిన రాజుగారి బొమ్మలో సరిగ్గా ఉన్న కన్నును మాత్రమే చిత్రకారుడు బొమ్మలో చూపించాడు. మెల్లకన్ను చిత్రంలో అవతలి వైపుగా ఉండి కన్పించకుండా ఉండేట్టు గీశాడు. చిత్రకారుడి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా ఆనందించడమే గాక అందమైన రూపంలో మంచితనంలో చిన్న అవలక్షణం, చెడ్డ గుణం కనిపించవనే నిండు నిజం తెలుసుకున్నారు.

17 ఏప్రిల్, 2012

వర్తకుడి సమయస్ఫూర్తి


ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు.

‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. 

రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. 

చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడిని పట్టుకోలేకపోయినందుకు సైనికాధికారులను కేకలేశాడు. అయితే ఆ మరునాడు వర్తకుడు అదే గుర్రంతో తిరిగి ఆస్థానానికి రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు.  వర్తకుడు వినయంగా రాజుకు నమస్కరించి ‘‘ప్రభూ! నా గుర్రాల పనితనాన్ని, నాణ్యతను మీకు తెలియజేయాలని అలా చేశాను. నన్ను క్షమించండి’’ అన్నాడు.

వర్తకుడి సమయస్ఫూర్తికి, తెలివితేటలకు రాజు ఎంతగానో సంతోషించాడు. వర్తకుడి దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అతడు చెప్పిన ధర చెల్లించి కొన్నాడు రాజు.

16 ఏప్రిల్, 2012

రామయ్య ఉపాయం


ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు.అతడు టోపీలు కుట్టుకుని పొరుగూరిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జీవితం గడిపేవాడు.ఒక రోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలిసిపోయి ,ఒక చెట్టు క్రిందకు వచ్చిటోపీల బుట్ట ప్రక్కన పెట్టి ఆ చెట్టు క్రిందే నిద్రపోయాడు.ఆ చెట్టుపైన చాలా కోతులు ఉన్నవి.

ఆకోతులునిద్రించు రామయ్య తలపైనున్న టోపీనీ చూసి క్రిందకు వచ్చిబుట్టలోనున్నా టోపీలనీ తీసుకొని తలా ఒకటొపీనీ పెట్టుకొని గంతులు వేస్తున్నవి కోతులు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్టవైపు చూసాడు.బుట్టలోని టోపీలు ఏమైనవి అని చుట్టు కలియ చూసాడు.తన టోపీలు పెట్టుకొని చెట్టుపైన ఆడుతున్న కోతులను చూసి ఏమిచేయాలో తోచలేదు.కొంతసేపు ఆలోచించినతరువాత ఒక ఆలోచన తట్టింది.వెంటనే తన తలపైనున్న టోపీ తీసి వేసి నేలపై విసిరాడు.అది గమనించిన కోతులు వాటి తలలమీద టోపీలు తీసి నేలమీదకు విసిరాయి.వెంటనే  రామయ్య టోపీలన్ని ఏరీ బుట్టలో వేసుకొని తన దారినతాను వెళ్ళిపోయాడు.

నీతి: ఉపాయంతో సమస్యలు సాధించవచ్చు.
 

స్వార్ధపరులతో స్నేహం


 అనగనగా రామయ్య, సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు.వారు ఒకరోజు పక్కఊరికి ప్రయణమై వెళ్ళారు.మధ్యలో ఒక అడవి ఉంది.తిరుగు ప్రయాణమై వస్తుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి ఒకటి వీరిని చూచింది.వీరివైపు పరుగెత్తుకు రావడం చూచారు.

వెంటనే రామయ్య గబ గబ  చెట్టుమీదకు ఎక్కి కూర్చున్నాడు.కాని సోమయ్య మాత్రం చెట్టు ఎక్క రాకరాక పొవడంతో చనిపోయినట్టుగాకింద పడుకున్నాడు.ఎలుగుబంటి సోమయ్య దగ్గరకు వచ్చి వాసన చూసి  చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయింది.అది అటు వెళ్ళగానే రామయ్య చెట్టు దిగి వచ్చి ఏమి సోమయ్య ఎలుగుబంటి నీతో చెవిలో ఏదొ రహస్యం చెప్పినట్టుంది అని హాస్యామాడాడు.అప్పుడు సోమయ్య అందుకు బదులుగా  స్వార్ధపరులతో స్నేహం చేయకు అని చెప్పింది అంటూ బదులిచ్చాడు.అది విన్నాకా రామయ్య సిగ్గుతో తల దించుకున్నాడు.

నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు

చీమ ప్రత్యుపకారం

నది ఒడ్డున ఉన్న ఒక మర్రిచెట్టుపైన ఒక పావురం నివసిస్తూంది.ఒకరోజు అది నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను చూసింది.ఆ చీమను ఎలాగైన కాపాడాలి అనుకున్నది.వెంటనే ఒక మర్రి ఆకును తెంపి చీమకు దగ్గరలో నీళ్ళలో వేసింది పావురం.

ఆ అకుపై చీమ ఎక్కి కూర్చుంది.తేలుతున్న ఆ ఆకు ఒడ్డును చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురమును చూసి అది చేసిన సహాయానికి తన ధన్యవాదాలను తెలియజేసింది చీమ. ఒకరోజు చీమ పక్షులకోసం నాలుగువైపుల గాలిస్తున్న వేటగాన్ని చూసింది.చెట్టుపైన కూర్చుని ఉన్న తన ప్రాణాలను కాపాడిన పావురాన్ని చూసింది.ఆ వేటగాడు చెట్టుపైన కూర్చున్న పావురం పైకి విల్లు ఎక్కు పెట్టి గురి పెట్టాడు.ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి ఆలస్యం చేయకుండ కుట్టింది.బాదతో వెటగాడు అరిచాడు.బాణం గురి తప్పింది.పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది.వేటగాడు వెళ్ళిపోయాక పావురం తనకు ప్రత్యుపకారం చేసిన చీమకు ధన్యవాదాలు చెప్పుకుంది. 

13 ఏప్రిల్, 2012

కుందేలుకు గుణపాఠం


 కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు.

తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు.

గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గరే కూలబడి, ‘‘నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదూ!’’ అంది. ‘‘అవును. నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలనే ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా భోజనం చేద్దాం’’ అంటూ పిలిచింది తాబేలు. దానితో కుందేలు తన తప్పు తెలుసుకుంది.

ఎలుగుబంటి ఉపాయం

ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. తను ఉండటానికి ఎంతో శ్రమపడి ఒక గుహను నిర్మించుకుంది. రంగురంగుల పువ్వులు, రకరకాల ఆకులు ఏరుకునివచ్చి గుహకు అలంకరించింది. దాంతో ఎలుగుబంటి గుహ చాలా అందంగా తయారైంది. జంతువులన్నీ వచ్చి ఆ గుహను చూసి ఎలుగుబంటిని అభినందించసాగాయి. ఆనోటా ఈనోటా ఈ విషయం ఆ అడవికి రాజైన సింహానికి తెలిసింది. దానికి ఈర్ష్య కలిగింది. ‘అడవికి రాజును నేను. అంత అందమైన గుహ నా దగ్గర తప్ప మరొకరి దగ్గర ఉండటానికి వీల్లేదు’ అనుకుని వెంటనే ఆ గుహను వెతుక్కుంటూ బయలుదేరింది.

సింహం ఆ గుహను చూసింది. ‘నిజంగా చాలా బాగుంది. నేనిక్కడే ఉంటాను’ అనుకుంటూ లోపలకి వెళ్లింది. అక్కడున్న ఎలుగుబంటితో ‘‘ఇకనుండి ఈ గుహ నాది. నువ్వు బయటకు వెళ్లి మరో గుహ కట్టుకోపో’’ అని శాసించింది.ఎలుగుబంటికి ఏం చేయాలో తోచలేదు, పాపం ఏడుస్తూ వెళ్ళిపోసాగింది. దారిలో ఒక నక్క ఎదురైంది. జరిగిన విషయం విని నక్క ‘‘బాధ పడకు. నేను చెప్పినట్టు చెయ్యి’’ అంటూ ఒక ఉపాయం చెప్పింది.

మరునాడు ఎలుగుబంటి ఒక సంచి తీసుకుని సింహం దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో సింహం నిద్రపోతోంది. ఎలుగుబంటి నెమ్మదిగా ఆ సంచిని అక్కడే ఉన్న ఒక బల్ల మీద పెట్టి బయటకు వచ్చేసింది. కాస్సేపటి తరువాత సింహం నిద్ర లేచింది. బల్లమీద సంచి కనబడగానే ఆసక్తిగా దాన్ని విప్పి చూసింది. సంచి మూతి తెరుచుకోగానే ‘గుయ్‌’ మని కొన్ని వందల తేనెటీగలు బయటకు వచ్చాయి. అంతసేపు సంచిలో బంధింపబడి ఉండటం వల్ల అవి చాలా కోపంగా ఉన్నాయి. ఒక్కసారిగా అవి సింహం మీదకు దాడి చేసాయి. 

వాటిని తప్పించుకోవడానికి సింహం గుహ బయటకు పరుగెత్తింది. తేనెటీగలు దాన్ని వదలక వెంటబడి మరీ కుట్టసాగాయి. అలా తేనెటీగలు సింహాన్ని చాలా దూరం తరిమాయి. సింహం ఎలాగోలా వాటి బారి నుండి తప్పించుకుంది. ఆ సంఘటనతో భయపడ్డ సింహం మళ్ళీ ఎలుగుబంటి గుహ పేరెత్తలేదు. సింహం పీడ విరగడవడంతో ఎలుగుబంటి తిరిగి తన గుహలో ఆనందంగా ఉండసాగింది.

12 ఏప్రిల్, 2012

పావురాల జంట కృతజ్ఞత

అడవిలో కట్టెలు కొట్టుకుని జీవించే సీతయ్య ఎప్పట్లాగే ఆరోజు కూడా అడవికి కట్టెలు కొట్టేందుకు అడవికి బయలుదేరాడు. అలా వెళ్తుండగా దారిలో ఓ వేటగాడు పావురాలను వేటాడుతూ... ఓ వలలో బియ్యం నూకలు చల్లి, వెళ్లడాన్ని గమనించాడు.ఇంతలో.. వేటగాడు అలా వెళ్లాడో లేదో బియ్యం నూకలకు ఆశపడ్డ ఓ పావురాల జంట వచ్చి వలలో వాలాయి. అంతే ఒక్కసారిగా వలలో ఇరుక్కుపోయాయి. ప్రాణభీతితో అల్లాడుతున్న పావురాలను ఎలాగైనా రక్షించాలనుకున్న సీతయ్య వాటిని వలనుంచి తప్పి పైకి ఎగురవేసి కట్టెల కోసం వెళ్లిపోయాడు.

అలా కొంతకాలం గడచిన తరువాత సీతయ్య ఎప్పట్లాగే అడవికి వెళ్లి వస్తూనే ఉంటాడు. ఒకరోజు అడవిలో దారి తప్పి బాగా లోపలి ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. అతడు దారి తెలియక అవస్థపడుతూ తిరుగుతుంటే ఈలోపు చీకటి కూడా పడింది. అడవిలోని క్రూర మృగాలు తనను ఏం చేస్తాయో ఏమో అని భయపడుతూ ఉన్న సీతయ్య దగ్గర్లో ఓ చిన్న గుడిసె లాంటిది కనిపించింది.
 
సీతయ్య గబగబా గుడిసె దగ్గరికి వేగంగా నడుస్తుండగానే జోరున వర్షం మొదలయ్యింది. ఏంటో ఈ పాడు వర్షం వేళాపాళా లేకుండా.. దారి తప్పోయాను, ఇంటికెళ్ళాలో తెలియటం లేదు. భగవంతుడా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రీ...! అంటూ మనసులో గొణుక్కుంటూ ఉండిపోయాడు.

 
అయితే... అదే గుడిసె పైనున్న పావురాల జంట సీతయ్యను గుర్తించి, తమ ప్రాణాలను కాపాడిన అతడిని ఎలాగైనా సరే ఇంటికి చేర్చాలని అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా అతడి తలపైనున్న గుడ్డను తన్నుకుని వెళ్ళాయి. తలగుడ్డ ఎగిరిపోవడంతో పైకెత్తి చూసిన సీతయ్య పావురాల జంటను వెంబడిస్తూ పరుగులు తీశాడు.
 
అలా అలా తనకు తెలిసిన దోవలోకి పరుగెత్తిన సీతయ్యకు పావురాలు చేసిన సహాయం అర్థమైంది. తనని ఇంటికి చేర్చేందుకే ఈ పావురాలు తన తలగుడ్డను తన్నుకుపోయాయని అర్థం చేసుకున్నాడు. చిన్న జీవులైనప్పటికీ, వాటిని కాపాడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించాయని అనుకున్నాడు. వెంటనే ఆ పావురాలను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉంచుకుని పెంచుకోసాగాడు సీతయ్య.

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి, తనను బంధించి తీసుకుపోయి బోనులో పెడతాడో, లేక ప్రాణాలే తీస్తాడో... అనుకుంటూ బాధపడసాగింది.

ఇదంతా చూసిన చిట్టెలుక సింహం హీన స్థితిని చూసి జాలిపడింది. సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకుని నిర్ణయించుకున్న చిట్టెలుక గబా గబా వల తాళ్ళంన్నింటినీ కొరకసాగింది. చిట్టెలుక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. మొత్తం వల తాళ్ళన్నింటినీ చిట్టెలుక కొరికేయడంతో, సింహం వలనుండి బయటపడింది.

చిట్టెలుక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది... "ఒకరోజు నేను నిన్ను నా కాలుగోటితో సమానమని కించపరిచేలా మాట్లాడాను, ఈసడించుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోని నీవు, నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టానన్న ఒకే ఒక్క కారణంతో ఈరోజు నన్ను కాపాడావు. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను మన్నించు" అని చిట్టెలుకతో అంది. అవన్నీ ఇప్పుడెందుకు మృగరాజా... మీరు చేసిన సహాయానికి, నేను ఈరోజు మిమ్మల్ని కాపాడాను అంతే..! అని సర్దిచెప్పింది చిట్టెలుక. ఆరోజు నుండి సింహం, చిట్టెలుకలు ఎంతో సఖ్యతగా జీవించసాగాయి.

నీతి : ఎంత చిన్నవారినైనా కించపరచకూడదు, దూషించకూడదు, హేళన చేయకూడదు.

7 ఏప్రిల్, 2012

తోక చివర తెల్ల మచ్చ ఉన్ననక్క


అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది. నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందంగా ఉండేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా ఉండేది. ఒక రోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’ అనుకున్నది. పైకి గుర్రంతో ‘‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతోంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడ నుంచి పారిపో’’ అన్నది. 

‘‘ఏమిటా ప్రమాదం’’ అని అడిగింది గుర్రం. ‘‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’’ అంది నక్క. నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది. ‘‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’’ అని చెప్పి, ‘‘నక్కా... నక్కా... నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’’ అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క. 

మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట. అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’’ అని చెప్పింది. దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్లమధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్లింది.

మూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తోందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’’ అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడడానికి కోతి వచ్చింది, అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేని పోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘‘సింహం వస్తోందా’’ అని అడిగింది నక్క. ‘‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా? భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’’ అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకుని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది.

6 ఏప్రిల్, 2012

మెదడు లేని వరాహం


అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి పంది మెదడును తినాలని కోరిక పుట్టింది. అయితే పందిని చంపి తినగలిగే శక్తి నక్కకు లేదు. నక్క అసలే జిత్తులమారి. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అడవి రాజు సింహం దగ్గరకు వెళ్లింది. ‘‘రాజా మీకు పంది మాంసంతో విందు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కాదనకూడదు. అలాగే మీరు నాకు సహాయం చేయాలి’’ అని అడిగింది నక్క. పందిమాంసంతో విందు అనగానే సింహానికి నోరూరింది, ఇక ఏమీ ఆలోచించకుండా సరేనని ఒప్పుకున్నది. 

నక్క ఒకరోజు పంది దగ్గరకు వెళ్లింది. ‘‘నిన్ను అడవికి రాజును చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఈ అడవికి రాజువి కావచ్చు’’ అని ఆశపెట్టింది. తెలివితక్కువ పంది ఆ మాటలను నమ్మింది. వెంటనే నక్క వెంట వెళ్లింది. పందిని నక్క సరాసరి సింహం దగ్గరకు తీసుకెళ్లింది. పంది భయపడింది. వణుకుతూనే సింహం దగ్గరకు నడిచింది. వెంటనే సింహం పంది మీదకు దూకబోయింది. పంది తప్పించుకుని పారిపోయింది.

నక్క మరలా పంది దగ్గరకు వెళ్లింది. ‘‘ఎందుకు పారిపోయి వచ్చేశావు?’’ అని అడిగింది. ‘‘సింహం నన్ను చంపబోయింది, తప్పించుకుని వచ్చేశాను’’ అని చెప్పింది పంది. ‘‘సింహం నిన్ను చంపటానికి రాలేదు. కాబోయే రాజువు కదా అని నిన్ను కౌగిలించుకుని అభినందించడానికి వచ్చింది. నువ్వు అనవసరంగా భయపడ్డావు’’ అని పందికి సర్ది చెప్పి దానిని మళ్లీ సింహం దగ్గరకు తీసుకెళ్లింది నక్క.
సింహం దగ్గరకు వెళ్లిన తర్వాత పందిని ‘తల వంచి నమస్కరించ’మని చెప్పింది నక్క. పంది తల వంచగానే, సింహం దానిని చంపేసింది. వెంటనే పంది మాంసాన్ని తినబోయింది సింహం. నక్క వారించింది.

పంది మాంసాన్ని స్నానం చేసి వచ్చి తినాలని చెప్పింది. అలాగేనని వెళ్లింది సింహం. అది స్నానం చేసి వచ్చే లోపుగానే పంది మెదడును తినేసింది నక్క. సింహం వచ్చి పంది మెదడు ఏదని అడిగింది.  ‘‘రాజా, ఆ పందికి మెద డే ఉంటే రెండుసార్లు నా మాటలు నమ్మి మీ దగ్గరకు ఎందుకు కొస్తుంది?!’’ అన్నది నక్క. ‘నిజమే దానికి మెదడు ఉంటే నా దగ్గరకు వచ్చి ఉండేది కాదు’ అనుకుంది సింహం. సింహం మాంసం తినటం మొదలు పెట్టింది. ఈ లోగా నక్క నెమ్మదిగా బయటకు జారుకుంది. నక్క ఆ విధంగా పంది మెదడును తినాలనే కోరికను తీర్చుకుంది.

5 ఏప్రిల్, 2012

నడ్డి విరిగిన నక్క


అనగనగా ఒక అడవిలో ఒక టక్కరినక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. నక్కను చూడగానే పులి దాని వెంటపడింది. ‘బాబోయ్! నా ఆకలి సంగతి సరే.  ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారమైపోతాను’ అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో దానికి నిద్రాభంగమై కళ్ళుతెరిచి చూసింది.

‘‘ఎలుగుబంటి మామా! ఈ చెట్టు కింద ఒక పులి నాకోసం కాచుకుని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు’’ అని ప్రాధేయపడింది. ‘సరే’నంటూ ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది. ఎంతకీ పులి కదలకపోవడంతో దాని బారినుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది. చివరకి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ‘దీన్ని కిందకు తోసేస్తే? అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినొచ్చు. ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది’ అని ఆలోచించి నక్క ఎలుగుబంటిని కిందకు తోసేసింది.

అయితే ఎలుగుబంటి పడటం పడటం సరిగ్గా పులి మీద పడింది. ఎలుగుబంటి బరువుకు పులి నడ్డి విరిగింది. జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది. అంతే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క గూబ మీద ఒక్కటిచ్చింది. గూబ గుయ్యిమన్న నక్క పట్టు తప్పి కింద పడింది. దానితో దాని నడ్డి కూడా విరిగింది.

4 ఏప్రిల్, 2012

నక్కబావ సమయస్ఫూర్తి

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది.. నేను మా అత్తగారింటికి వెళ్లాలి అని.. ఇక అనుకుందే తడవుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగా రింటికి బయలుదేరింది. అలా..అలా.. నడుచుకుంటూ అడవి దాటుకుని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పేద్ధ బండరాయి కింది పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడినుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. 


ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువెైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. ‘అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు ? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది. ఎలా?...’ ఆలోచించింది.. ఒక ఉపా యం తట్టింది. అంతే.. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్నిపట్టి ఉంచి వీపును కొండకు ఆనించి, మిగతా తనపెై రెండు కాళ్లను ముడు చుకుని ఎంతో కష్ట పడి ఆ కొండను మోస్తున్నట్లు ఆపసో పాలు పడుతూ, చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది..



‘ఏం! నక్కబావ ! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్‌?’ అని నక్కని పులి అడిగింది. ‘ఏం చెయ్యను పులి మావా! నేను ఈ కొండ దగ్గరికి రా గానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను.. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటి నుంచీ అ న్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పిడచకట్టి పోతోంది. ’ అని పులితో బాధగా అన్నది నక్క..పాపం పులికి జాలి కలి గింది.. నక్కతో అన్నది కదా..‘సరే ! అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్లి తాగిరా.. అ ప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను..నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను..నేను మొయ్యనుగాక మొ య్య ను.. త్వరగా వెళ్లిరా..’ అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. 



నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తనభారం అప్ప చెప్పింది. ఇక పులికూడా ఆ కొండ ఎక్క డ మీ ద పడుతుందోనని కాళ్లు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పు డు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ..‘వస్తా పులి మావా! నీళ్లు తాగంగానే చప్పున వ చ్చేస్తా.. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే..’ అంటూ నీరసంగా మాట్లాడింది.



‘పాపం.. వెళ్లిరా..’ అంటూ నక్కమీద పులి జాలిపడింది..పులి. అంతే ఇక కొద్దిగా ముం దుకు నడిచి ఒక్క ఉదుటన ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది నక్క.గంట...గంటా గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్మా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్ఛర్యం.. కొండ కొద్దిగా కూడా కదలలేదు. ‘అరె..నక్క నన్ను ఎంత మోసం చేసిం దీ’ అనుకుంటూ ఈ సారికి బతికి పోయింది అనుకుంటూ తనదారిన తాను పులి వెళ్లిపోయింది. 

3 ఏప్రిల్, 2012

నక్కబావ సమయస్ఫూర్తి


అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంటోంది. ఒకసారి అనుకుంది.. నేను మా అత్తగారింటికి వెళ్లాలి అని.. ఇక అనుకుందే తడవుగా పక్క ఊరిలో ఉన్న తన అత్తగా రింటికి బయలుదేరింది. అలా..అలా.. నడుచుకుంటూ అడవి దాటుకుని కొండదారి వెంట వెళ్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నమైంది. కాసేపు ఇక్కడ ఒక కునుకు తీసి వెళ్తాను అని ఒక పేద్ధ బండరాయి కింది పడుకుంది. అలా పడుకుందో లేదో ఎక్కడినుండో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది. 

ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎటువెైపు నుండి పులి వస్తోందా అని తేరపార చూసింది. దూరంగా పులి నడుచుకుంటూ వస్తోంది. ‘అయ్యోయ్యో! ఎలా ఇప్పుడు ? నేను బతికేది? ఈ పులి నన్ను తప్పక చంపుకు తింటుంది. ఎలా?...’ ఆలోచించింది.. ఒక ఉపా యం తట్టింది. అంతే.. వెంటనే లేచి ఆ పెద్ద కొండకు దిగువన తన రెండు కాళ్లను నేలకు తన్నిపట్టి ఉంచి వీపును కొండకు ఆనించి, మిగతా తనపెై రెండు కాళ్లను ముడు చుకుని ఎంతో కష్ట పడి ఆ కొండను మోస్తున్నట్లు ఆపసో పాలు పడుతూ, చెమటలు కారుతున్నట్లు నటిస్తూ ఉంది. ఇంతలో పులి రానే వచ్చింది. నక్క కష్టాలు చూడనే చూసింది..

‘ఏం! నక్కబావ ! ఏంటి ఆ కొండను మోస్తున్నావ్‌?’ అని నక్కని పులి అడిగింది. ‘ఏం చెయ్యను పులి మావా! నేను ఈ కొండ దగ్గరికి రా గానే ఇది నా మీద పడబోయింది. పడితే నేను చస్తాను.. అందుకని పడకుండా ఆపుతున్నాను. పొద్దుటి నుంచీ అ న్నం, నీళ్లు లేవు. దాహం, ఆకలితో నోరు పిడచకట్టి పోతోంది. ’ అని పులితో బాధగా అన్నది నక్క..పాపం పులికి జాలి కలి గింది.. నక్కతో అన్నది కదా..‘సరే ! అదిగో అక్కడ నీళ్ల గుంట ఉంది. వెళ్లి తాగిరా.. అ ప్పటిదాకా నేను ఈ కొండను మోస్తాను..నువ్వు రాగానే ఈ కొండ భారం నీకే ఇస్తాను..నేను మొయ్యనుగాక మొ య్య ను.. త్వరగా వెళ్లిరా..’ అంటూ పులి నక్కకు సలహా ఇచ్చింది. 

నక్క తను వేసిన పాచిక పారిందని తనలో తాను నవ్వుకుంటూ పులికి తనభారం అప్ప చెప్పింది. ఇక పులికూడా ఆ కొండ ఎక్క డ మీ ద పడుతుందోనని కాళ్లు తన్నిపట్టి వీపుని కొండకు ఆనించి గట్టిగా నిలబడింది. అప్పు డు నక్క మెల్లగా తన భారాన్ని దింపుకున్నట్లు నటిస్తూ..‘వస్తా పులి మావా! నీళ్లు తాగంగానే చప్పున వ చ్చేస్తా.. నిన్ను ఇబ్బంది పెడతానా? వచ్చి నా భారం నేను మోస్తాలే..’ అంటూ నీరసంగా మాట్లాడింది.

‘పాపం.. వెళ్లిరా..’ అంటూ నక్కమీద పులి జాలిపడింది..పులి. అంతే ఇక కొద్దిగా ముం దుకు నడిచి ఒక్క ఉదుటన ముందుకు దూకి వెనక్కి చూడకుండా పరుగు లంకించుకుని పారిపోయింది నక్క.గంట...గంటా గడిచిపోతోంది. నక్క ఎంతకీ రావట్లేదు. ఎందుకు చెప్మా అని తనలో తాను అనుకుంటూ పులి ఎదురు చూసింది. పాపం ఆ కుంటలో పడిపోయి చచ్చి ఉంటుంది అనుకుంటూ ఇక నేను మాత్రం ఎందుకు ఇంత బరువును ఆపాలి అని అనుకుంది. మెల్లగా కొండ నుంచి తన శరీరాన్ని కదుపుతూ ఎక్కడ మీదకు పడుతుందో అని ఒక్కసారి పక్కకు దూకింది పులి. ఆశ్ఛర్యం.. కొండ కొద్దిగా కూడా కదలలేదు. ‘అరె..నక్క నన్ను ఎంత మోసం చేసిం దీ’ అనుకుంటూ ఈ సారికి బతికి పోయింది అనుకుంటూ తనదారిన తాను పులి వెళ్లిపోయింది. 

2 ఏప్రిల్, 2012

నీలిరంగు నక్క


అనగనగా ఒక నక్క. ఆహారం కోసం వెతుకుతూ అది అడవిని దాటింది. నగరంలోకి వచ్చి పడింది. నెమ్మదిగా నేత పనివాళ్ల వాడకు వెళ్లింది. దాహం వేయడంతో నీళ్ల పీపా అనుకుని నీలిమందు కలిపిన ఓ పీపాలోకి దూకింది. దాంతో అది నీలినక్కగా మారిపోయింది. ఎలాగో మళ్లీ అడవిలోకి చేరుకుంది. 

తీరా అది అడవిలోకి వెళ్లేసరికి జంతువులు దాన్ని గుర్తించలేక పోయాయి. నీలిరంగులో వుండే సరికి ఇదేదో కొత్త జంతువనే అనుకున్నాయి. ఆ జిత్తుల మారి నక్క తన రంగుతో లాభం పొందాలనుకుంది. అన్ని జంతువులను చేరబిలిచి, ‘‘నేను మీ కొత్త రాజును. నాకు రోజూ మీరే ఆహారం తెచ్చి పెట్టాలి’’ అంది. ‘‘...అందుకు ప్రతిఫలంగా మీకే హానీ చేయను’’ అని కూడా హామీ ఇచ్చింది. దాంతో జంతువులన్నీ తలలూపాయి. అప్పటినుంచి దానికి తామే ఆహారం సమకూర్చి పెట్టసాగాయి.

అలా కాలం గడిచింది. ఒక రాత్రి కొన్ని నక్కలు ఊళ వేయసాగాయి.  ఒంటరిగా ఉన్న నక్క అది వింది.  తాను కూడా బదులుగా వూళ వేసింది. అంతే, దొరికిపోయింది. ఆ జంతువులన్నీ అది నక్కే అని తెలుసుకుని ఇక తరిమి తరిమి కొట్టాయి.

1 ఏప్రిల్, 2012

రాజకుమారుడు

      మాళవరాజుకు పురుషోత్తముడనే కొడుకు ఉండేవాడు. పురుషోత్తముడు ఏమాత్రం చురుకుదనం లేకుండా అమాయకంగా, నెమ్మదిగా ఉండేవాడు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో ఏమవుతాడో ఏమోనని రాజుగారికి దిగులు పట్టుకుంది. దాంతో దేశంలోని గొప్ప గొప్ప పండితులను పిలిపించి, తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పాడు.

పండితులు రాజుగారి ఆజ్ఞను శిరసావహించి పురుషోత్తముడిని తమతోపాటు తీసుకెళ్లారు. ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన ఆ పండితులు రాజకుమారుడికి తగిన విద్యాబుద్ధులు నేర్పించి తిరిగీ తండ్రివద్దకు తీసుకొచ్చారు. "మహారాజా..! మీ సుపుత్రుడికి తమకు తెలిసిన విద్యలన్నింటినీ నేర్పించామనీ, కావాలంటే తమరోసారి పరీక్షించి చూడండని" అన్నాడు పండితులు.

దీంతో రాజుగారు తన కుమారుడికి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. అన్నింటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజకుమారుడు. అదంతా స్వయంగా చూసిన రాజుగారు సంతోషించి పండితులను బాగా సత్కరించి పంపించారు. అయితే వృద్ధుడయిన ఒక మంత్రి రాజుగారి వద్దకు వచ్చి.. "మహారాజా..! యువరాజుగారు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని" సూచించాడు.

అవును నిజమే కదా..! అని మనసులోనే అనుకున్న రాజుగారు.. "సరే.. ఆ విద్య తెలిసిన ఓ పండితుడి గురించి మీరే చెప్పండని" మంత్రిని అడిగాడు. "మహారాజా..! ఈ భవిష్యత్ జ్ఞానం అనేది పండితుల నుంచి నేర్చుకునేది కాదు గానీ, లోకజ్ఞానం తెల్సిన వివేకవంతుల ద్వారా నేర్చుకోవాల్సిన విషయం" అని చెప్పాడు మంత్రి.


తనకు మాధవుడు అనే ఓ సామాన్య వ్యక్తి తెలుసనీ.. అతడయితే మన రాజకుమారుడికి తగిన వివేకాన్ని, విచక్షణను నేర్పగల సమర్థత కలిగినవాడని చెప్పాడు మంత్రి. వెంటనే రాజుగారు మాధవుడిని పిలిపించి తన కుమారుడికి జ్ఞానాన్ని బోధించమని చెప్పగా.. మాధవుడు సరేనని రాజకుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు.

మూడు నెలల తరువాత రాజకుమారుడిని తండ్రి వద్దకు తీసుకొచ్చిన మాధవుడు.. తనకు తెలిసిన జ్ఞానాన్నంతా మీ సుపుత్రుడికి నేర్పానని చెప్పాడు. దాంతో మంచి వివేకి అయిన తన వృద్ధ మంత్రిని పిలిపించి మీరే రాకుమారుడిని పరీక్షించండని అన్నాడు. వృద్ధమంత్రి లోపలి గదిలోకి వెళ్లి గుప్పిట్లో ఏదో పట్టుకొచ్చి నా గుప్పెట్లో ఏముందో చెప్పండి యువరాజా అని అడిగాడు.

పురుషోత్తముడు ఏ మాత్రం తడుముకోకుండా "ఉంగరం" అని చెప్పాడు. దాంతో రాజుగారితోపాటు, సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. వృద్ధ మంత్రి కూడా ఆశ్చర్యానికి గురై నోట మాట రాకపోగా.. "సమాధానం ఎలా చెప్పగలిగారు యువరాజా..?" అని ప్రశ్నించాడు.

"ఏమీలేదు మంత్రివర్యా...! మిమ్మల్ని మా తండ్రిగారు పిల్చినప్పుడు మీ వేలికి ఉంగరం ఉంది. మీరు గదిలోకి వెళ్లి వచ్చిన తరువాత ఉంగరం మీ వేలికి లేదుకదా..!" అన్నాడు. దీనికి సంతోషించిన మంత్రి.. "మహారాజా..! పరిశీలన ఉంటే, భవిష్యత్తును పసిగట్టే జ్ఞానం వస్తుంది. ఆ నేర్పు యువరాజా వారికి ఇప్పుడు సంపూర్ణంగా ఉంద"ని అన్నాడు.

తన కుమారుడు విద్యతోపాటు వివేకం పొందినందుకు ఎంతగానో సంతోషించిన మహారాజావారు.. వృద్ధ మంత్రితోపాటు, తన కుమారుడికి విచక్షణా జ్ఞానాన్ని నేర్పించిన మాధవుడికి లెక్కలేనన్ని కానుకలు సమర్పించి, సత్కరించారు. ఇక ఆరోజు నుంచి భవిష్యత్తుపై బెంగలేకుండా మహారాజు సంతోషంగా గడపసాగాడు.

తోక తెగిన నక్క

అదొక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఓసారి అది, జంతువులను పట్టుకోటానికి వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుంది. దాన్నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించింది. చివరకు తప్పించుకుంది. కానీ ఆ ప్రయత్నంలో అనుకోకుండా దాని తోక తెగిపోయింది. దాంతో ఎక్కడలేని దిగులూ నక్కకు పట్టుకుంది.


‘‘అయ్యో, నా తోక తెగిపోయిందే. ఇప్పుడెలా! తోక లేని నన్ను చూసి అడవిలోని మిగిలిన నక్కలన్నీ గేలి చేస్తాయేమో’’ అంటూ బెంగపడింది. ఆ అవమానాలు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం మొదలెట్టింది. అప్పుడు దానికో ఉపాయం తట్టింది. వెంటనే మిగిలిన నక్కలన్నిటినీ పిలిచి, ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అన్నీ వచ్చాక ఇలా అంది.


‘‘చూడండి మిత్రులారా! ఇవాళ నేనో కొత్త విషయం తెలుసుకున్నాను. అది మీ అందరికీ చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మనం మామూలుగానే అందంగా ఉంటాం. కానీ మన తోకలు కత్తిరించుకుంటే ఇంకా అందంగా ఉంటాం. అయినా తోక వల్ల మనకు పెద్ద ఉపయోగమేమీ లేదు సరికదా అదో బరువు కూడా. అందుకే మీరందరూ కూడా నాలా తోకలు కత్తిరించుకుంటే మరింత సుందరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఓసారి ఆలోచించండి’’ అంది.


అక్కడున్న నక్కల్లో ఒకదానికి విషయం అర్థమయ్యింది. ‘‘మిత్రమా! నువ్వు తోకను అందం కోసం కత్తిరించుకోలేదని, అది ప్రమాదంలో తెగిపోయిందని నాకు తెలుసు. అయినా నీ తోక తెగిపోకుండా ఉంటే, నువ్విలాగే చెప్పేదానివా’’ అని అడిగింది.తన పథకం వారికి తెలిసిపోవడంతో నక్క మారు మాట్లాడలేకపోయింది. అతి తెలివికి పోతే మనమే బోల్తా పడతామని తెలుసుకుని, మెల్లగా అక్కడ్నుంచి జారుకుంది.

పేదరాశి పెద్దమ్మ కధ

సింహళ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య తలపై ఒక వెంట్రుక, రెండో భార్య తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రాజుగారి రెండో భార్య.. "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.

మొదటి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి. 

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చిన పెద్ద భార్య... "నాకు బోలెడన్ని వెంట్రుకలు ఉన్నాయి, మీ రెండో భార్యకు రెండే వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి ఆమెని ఇంట్లోంచి తరిమేయండని" అడిగింది. వెంటనే రాజు రెండో భార్యను తరిమేశాడు.

అలా రెండో భార్య ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి. దీంతో రెండో రాణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇక కథ కంచికి... మనం ఇంటికి .

ఆవు-పులి కథ

నాకు తెలిసి ఈ కథ వినని తెలుగువాడు వుండడు, కానీ మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం, ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు మనమే చొరవచేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.

ఒక ఊళ్ళో ఒక ఆవు వుండేది, అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్లు నడుచుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది, ఒకరోజు అది అడవిలో మేతమేస్తుండగా , బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంట బడింది, పులి ఎంతో అందంగా బలంగా నిగ నిగ లాడుతున్న ఆవుచూడగానే అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది, ఇది గమనించిన ఆవు ఆగు ఆగు పులిరాజ నేను చెప్పే మాటలు కొంచం ఆలకించు..నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను అని వేడుకుంది.

ఆవు మాటలకు పులి ఫక్కున నవ్వింది, ఒహో ఎంత నమ్మకంగా పలుకుతున్నావు చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమన్న పిచ్చిదాన్నా, చాలా ఆకలిమీదున్నాను నీ మాయమాటలకి పడిపోయి నిన్ను వదుల్తా ననుకున్నావా. అయ్యో!  పులి రాజ నన్ను నమ్ము నేనెప్పుడూ అసత్యమాడలేదు, నువ్వుదయతలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలు ఇచ్చివస్తాను, నిన్ను మోసగించి నేను బతకగలనా అయినా ఆ అసత్యపు జీవితం నాకు ఏల ఆకలితో అలమటిస్తున్న నీకు ఆకలి తీర్చడంకన్నా పుణ్య కార్యముందా నన్ను నమ్ము.

పులి ఆవుమాటలకు నవ్వి సరే వెల్లు కాని మళ్ళీ తిరిగిరాకపోయావో ఈ రోజుకాకపోయినా మరునాడు నువ్వు నాకు చిక్కకపోవు అప్పుడు చెపుతా నీ సంగతి అంది.అంతమాటలకే సంతోషించిన ఆవు ఆగమేగాలమీద ఇళ్ళు చేరుకుని తన బిడ్డకి కడుపునిండా పాలిచ్చి, బిడ్డా ఇదే నా ఆఖరిచూపు, మంచి దానిగా మసులుకో, బుద్దిమంతురాలుగా యజమానికి సహకరించు, తోటి వారితో సఖ్యంగా ఉండు గొడవలద్దు, జీవితంలో ఎప్పుడూ అబద్దం ఆడరాదు, సత్యాన్నే పలుకు అది నీకు మేలు చేస్తుంది, అందరిలోకి మంచిదానవుగా పేరు తెచ్చుకో జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్దులు చెప్పి సెలవుతీసుకుని అడవికి బయలుదేరింది.

అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరంగా ఆవు రావడం కనిపించి ఆశ్చర్యపోయింది, ఆహా ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారంగా అవడనికి తిరిగి వస్తుంది, తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంత గొప్పది, ఇలాంటి సత్యవచణురాలిని చంపితే నాకు పాపం తప్పదు అనుకుంది.ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాల నువ్వు ఎంత సత్యవచణురాలివి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఎదో విధంగా తీర్చుకుంటాను నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది.ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.
నీతి: అబద్దమాడకూడదు, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది